Oct 19 2023, 09:44
బ్యాగుల వ్యాపారుల ముసుగులో ‘బంగారు’ వల...
నకిలీ బంగారు చైన్లను చూపుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్
బ్యాగుల వ్యాపారుల ముసుగులో ‘బంగారు’ వల
అంతర్రాష్ట ముఠాలోని ఇద్దరి అరెస్టు, ఒకరు పరారీ..
రూ.7.20లక్షల విలువైన 9 తులాల బంగారం స్వాధీనం
సూర్యాపేట క్రైం, అక్టోబరు 11: బ్యాగుల వ్యాపారుల ముసుగులో ప్రజలకు నకిలీ బంగారం అంటగట్టి మోసం చేస్తున్న అంతర్రాష్ట ముఠాలోని ఇద్దరిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.7.20లక్షల విలువైన 9 తులాల బంగారు ఆభరణాలు, నకిలీ బంగారు చైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరించారు.
ముగ్గురు ముఠాగా ఏర్పడి పరిచయం పెంచుకుని..
మహారాష్ట్రలోని పర్బని జిల్లా పూర్ణ గ్రామానికి చెందిన ధరంచంద్ కన్నయ్యలాల్సోలంకి, విష్ణు, గుజరాత రాష్ట్రం అహ్మదాబాద్ పట్టణానికి చెందిన నారాయణ బ్యాగుల వ్యాపారులు. నారాయణ ప్రస్తుతం మేడ్చల్ -మల్కాజిరిగి జిల్లా సరస్వతినగర్లో స్థిరపడ్డాడు. ఈ ముగ్గురూ వివిధ ప్రాంతాలు తిరుగుతూ బ్యాగుల వ్యాపారం చేస్తుంటారు. ఆగస్టులో బ్యాగులు విక్రయించడానికి ఖమ్మం సమీపంలోని ఏదులాపురానికి వెళ్లారు. ఆ సమయంలో ఖమ్మంలోని కాల్వ ఒడ్డు సమీపంలోని చికెన సెంటరు నిర్వాహకురాలిని పరిచయం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన తాము రోడ్ల నిర్మాణ పనులు చేస్తామని, రోడ్ల తవ్వకాల్లో రెండు కిలోల పురాతన నాణేలు, బంగారు చైన్లు లభించాయని తెలిపారు. వాటిని స్వరాషా్ట్రనికి తీసుకువెళ్లాలంటే మార్గ మధ్యలో పోలీసుల తనిఖీలు ఉంటాయని, వాటిని తక్కువ ధరకే విక్రయిస్తామని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని నమ్మబలికారు. అప్పటికే తమ వద్ద ఉన్న ఒక బంగారు గుండును ఆ మహిళకు ఇచ్చి తనిఖీ చేయించుకోమని చెప్పారు. దానిని ఆమె తనిఖీ చేయించగా నిజమైన బంగారంగా తేలింది. దీంతో నిందితుల వద్ద ఉన్న మొత్తం బంగారం కొనుగోలు చేయడానికి ఆ మహిళ అంగీకరించింది. మొత్తం బంగారానికి రూ.10లక్షలు ఇవ్వాలని నిందితులు కోరగా, అంత డబ్బు తన వద్ద లేదని తన వద్ద ఉన్న బంగారు అభరణాలు తీసుకుని, బంగారు చైన్లు ఇవ్వాలని సదరు మహిళ కోరింది. అంగీకరించిన నిందితులు సూర్యాపేట ఆగస్టు 22వ తేదీన వచ్చి బంగారు ఆభరణాలు తీసుకెళ్లాలని చెప్పారు. వారి మాటలు నమ్మిన సదరు మహిళ సూర్యాపేటకు వచ్చి 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదును నిందితులకు ఇచ్చి, వారి నుంచి బంగారు చైన్లగా భావించి తీసుకుని వెళ్లింది. ఇంటికి వెళ్లి తర్వాత వాటిని తనిఖీ చేయించి అవి నకిలీ బంగారు చైన్లు అని ఆమె తెలుసుకుంది. సూర్యాపేటకు ఆగస్టు 23న ఆమె వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
స్వస్థలాలకు వెళుతుండగా ఇలా పట్టుబడ్డారు
బ్యాగుల వ్యాపారం చేస్తున్న నిందితులు బుధవారం స్వస్థలాలకు వెళ్లేందుకు ధరంచంద్ కన్నయ్యలాల్సోలంకి, నారాయణ సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్దకు వచ్చారు. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్ బుధవారం ఉదయం సూర్యాపేటలోని ఖమ్మం క్రాస్ రోడ్డు ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఆ ఇద్దరూ అనుమానాస్పదంగా సంచరిస్తున్నారు. పోలీస్ వాహనాన్ని చూసి పరారయ్యేందుకు యత్నించగా, పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు.
నిందితుల బ్యాగులను తనిఖీ చేసి కొన్ని పురాతన వెండి నాణేలు, నకిలీ బంగారు చైన్లను స్వాధీనం చేసుకోవడంతో, సదరు మహిళకు చెందిన 9తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసి ఆ ఇద్దరినీ అరెస్టు చేశారు. ఆ మహిళ నుంచి తీసుకున్న రూ.లక్ష నగదును నిందితులు అప్పటికే ఖర్చు చేశారు. నిందితుల్లో విష్ణు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్ననట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై గతంలో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, ఏపీ రాష్ట్రం అనంతపురంలో ఇలాంటి కేసులే ఉన్నాయన్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలిస్తామని ఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశలో అదనపు ఎస్పీ మేక నాగేశ్వరరావు, డీఎస్పీ పరిక నాగభూషణం, సూర్యాపేట పట్టణ ఇనస్పెక్టర్ జి.రాజశేఖర్, ఎస్ఐ యాకుబ్, సిబ్బంది గొర్ల కృష్ణయ్య, గోదేశి కర్ణాకర్, జె.సైదులు, ఆనంద్, చీకూరి మధు, మీరా తదితరులు పాల్గొన్నారు.
Oct 20 2023, 18:22